8, జులై 2012, ఆదివారం

శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం మహానంది


పరమేశ్వరుడు మహానందిలో శ్రీ మహానందీశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నారు.

మహానంది క్షేత్రం నంద్యాల కి 14కిలోమీటర్ల దూరంలో ఉంది.నంద్యాల కి చుట్టుపక్కల 15కిలోమీటర్ల దూరంలో నవనంది (నవ= తొమ్మిది + నంది) క్షేత్రాలు ఉన్నాయి. ఆక్షేత్రాలలో శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం విశిష్టమైనది.

మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ఫ్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది(విష్ణునంది) మరియు నాగనంది క్షేత్రాలే నవనంది క్షేత్రాలుగా కీర్తించబడ్డాయి.

ఈక్షేత్రంలో కోనేరు లో ఉన్న నీరు చాలా స్వచ్చంగా  ఉన్నాయి.  ఈక్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామిగా సన్నిధికి 
ఎదురుగా ఒక కోనేరు, ప్రాంగణం బయట మరో రెండు  కోనేరులు ఉన్నాయి.
          
ఈక్షేత్రంలో నవగ్రహాలకి దీపాలు వెలిగిస్తారు. 

ఈక్షేత్రంలో   మహానందీశ్వర స్వామి  స్వయంభూలింగం.గర్భాలయంలో శివలింగం చిన్నగా ఉండి పైభాగాన ఆవు పాదం ముద్రలు  కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై    నయనమనోహరంగా దర్శనమిస్తారు.

పార్వతీదేవి కామేశ్వరిగా కొలువుదీరిఉన్నారు. కామేశ్వరిదేవి పచ్చని మోవితో, సర్వాభరణభూషితురాలై వరదహస్తంతో  మంగళకరంగా దర్శనమిస్తారు.కామేశ్వరి దేవి కొలువైన ప్రాంగణంలో శిల్పకళ అపురూపం. ప్రాంగణం లోపల పైకప్పుపై సరస్వతీదేవి కచ్చపి ధరించి దర్శనమిస్తారు. రాతి స్థంభాలపై నాగకన్నియలు నిజంగానే చూస్తున్నట్లు ఉంది. పార్వతీ దేవి తనయులు వినాయక కార్తికేయులు కూడా దర్శనమిస్తారు.

ప్రక్కనే ఉన్న మరో ఆలయంలో సీతాలక్ష్మణ సహితంగా  శ్రీరామచంద్ర స్వామి ధవళ వర్ణంతో, ధగధగద్ధమాయంగా మెరిసిపోయే తిరువాభరణాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయ ముఖద్వారంవద్ద, ద్వారానికి మూడువైపులా చెక్కిన దశావతారాలు, హనుమ, గరుడాళ్వార్ దర్శనమిస్తారు. 

ప్రాంగణం లోపల పైకప్పుపై మహావిష్ణువు  శ్రీదేవితో కూడి ఖగరాజుపై అత్యంత  వర్ణశోభితంగా దర్శనమిస్తారు.  సీతాలక్ష్మణ సహితంగా  శ్రీరామచంద్ర  శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు కూడా దర్శించవచ్చు. 

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ .....
నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికి ఇలకు బహుదూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ .....

నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర

ఈప్రాంగణంలో ఉన్న రాతి స్థంభాలపై భారతమాత, నెహ్రు, గాంధి, జాతీయ జెండాని చెయ్యితిరిగిన శిల్పి చక్కగా మలిచారు.

శ్రీ మహానందీశ్వర స్వామివారి ప్రాంగణంలో వినాయకనంది కూడా దర్శనమిస్తారు. 

శ్రీ మహానందీశ్వర స్వామివారి  ఆలయానికి కొంచెం దూరంలో  గరుడనంది దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న విశేషం 
గరుడాళ్వారి చిన్న లోహపు విగ్రహం, శివలింగం పానపట్టంపై ఉన్నారు.  

గరుడనందిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే సుధానంది(సిమెంటుతో చేసిన నంది) కనిపిస్తుంది. ఆ నంది లోపలికి  వెళ్ళి చూడటానికి వీలుగా నంది విగ్రహం ఎడమవైపునుంచి ద్వారాన్ని కుడా ఏర్పాటుచేసారు.               
                
నంద్యాల నుంచి మహానంది వెళ్ళే దారిలో, మహానంది గ్రామం మొదటిలోనే కృష్ణనంది(విష్ణునంది)ఆలయానికి దారి అని సూచికలు ఉన్నాయి.      








  

30, జూన్ 2012, శనివారం

శ్రీ ఉమామహేశ్వర ఆలయం యాగంటి




యాగంటి క్షేత్రం బనగానపల్లె కి 14 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలో ఉంది. 

యాగంటి క్షేత్రంలో  పరమేశ్వరుడు పార్వతి సహితంగా ఉమామహేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ఉమామహేశ్వరులు ఏకశిలపై  నయన మనోహరంగా   కొలువుదీరి ఉన్నారు.  

ఈ  క్షేత్రంలో  నందీశ్వరుని విగ్రహం పెద్దగా ఉంది. ఈ  నందీశ్వరుని విగ్రహం  పెరిగే శిలతో మలిచారు అని ప్రతీతి అందుకే నందీశ్వరుని  రూపం ప్రతిష్టించినప్పటినుంచి పెరుగుతూ  ఉంది.  

అగస్థ్య కోనేరులో  నీరు చాలా స్వచ్చంగా  జలపుష్పాలతో నిర్మలంగా ఉంది. 

అగస్థ్య  మహర్షి ప్రతిస్టించిన  శివలింగం మరియు తపస్సుచేసిన ప్రదేశం అగస్థ్య  గుహలో  చూడవచ్చు.  అగస్థ్య  గుహలోలో కి వెళ్ళి దర్సనం చేసుకోవటానికి మెట్లు ఉన్నాయి.  ఈ మెట్లు  ఎక్కటానికి కొంచెం కష్టంగా ఉన్నాయి. 

ప్రక్కనే ఉన్న మరో గుహలో   శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా దర్సించుకోవచ్చు.
    








1, మే 2012, మంగళవారం

పద్మావతీదేవి పరిణయోత్సవాలు తిరుమల



తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో  పద్మావతీదేవి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. పద్మావతీదేవిని శ్రీనివాసుడు మొదటిసారిగా ఉద్యానవనంలో చూసాడని, అందుకు ప్రతీకగా పద్మావతీదేవి వార్షిక పరిణయోత్సవాలు, ఉద్యానవనంలో నిర్వహిస్తారు.


ఈ ఉత్సవాలలో శ్రీనివాసుడు అశ్వ, గజ, గరుడ వాహనాల మీద దర్శనమిస్తారు. 


ఈ ఉత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి  8 గంటల వరకు నిర్వహిస్తారు.